KC Venugopal : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలుపడంతో రెండు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ప్రస్తుతం తెరపడింది. అయితే తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంపై అగ్రరాజ్య ప్రమేయం నిజమేనా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ (KC Venugopal) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘భారతదేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా..? భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించి సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా..?’ అని వేణుగోపాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో తన జోక్యం ఉందని పేర్కొంటూ ప్రతిరోజూ ప్రకటనలు చేస్తున్నారని, వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ అంశాలపై చర్చించడానికి పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాలని ప్రధాని మోదీని ఇప్పటికే కోరామని చెప్పారు. ఇది పరిస్థితిని అంచనా వేయడానికే తప్ప ఒకరిని నిందించడానికి కాదని, ఏమైనా తప్పులు జరిగిఉంటే అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
కాగా, భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. దీనికి ముందు తమ మధ్యవర్తిత్వంతోనే ఇది జరిగిందంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. దాంతో కాల్పుల విరమణలో అమెరికా పాత్రపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయంపై ప్రధానికి వేర్వేరుగా లేఖలు కూడా రాశారు. ఈ అంశాలపై తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని వారు కోరారు.