న్యూఢిల్లీ : మణిపూర్లో (Manipur) ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రకటన పొడిపొడిగా ఉందని, ప్రకటన చేయడంలోనూ తీవ్ర జాప్యం జరిగిందని మండిపడ్డారు. మాటలు చెప్పడం ద్వారా ఒరిగేదేం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. మణిపూర్ హింసాకాండ నేపధ్యంలో 1800కుపైగా గంటల మౌనం తర్వాత ప్రధాని మోదీ ఎట్టకేలకు మణిపూర్పై కేవలం 30 సెకండ్లు మాట్లాడారని కాంగ్రెస్ నేత పెదవివిరిచారు.
మణిపూర్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి, అక్కడి సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని ప్రయత్నించారని దుయ్యబట్టారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా విపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మహిళలపై జరిగే నేరాలతో పోల్చడం సరికాదని అన్నారు. మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై వేధింపులను ఆయన విస్మరించారని ట్విట్టర్ వేదికగా జైరాం రమేష్ పేర్కొన్నారు.
మణిపూర్ హింసాకాండకు బాధ్యులుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించలేదని, అక్కడ శాంతియుత పరిస్ధితి నెలకొనేందుకు ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని జైరాం రమేష్ ఆరోపించారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రధాని మౌనం వీడుతూ రాజస్ధాన్, చత్తీస్ఘఢ్ రాష్ట్రాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ రాజకీయ క్రీడకు తెరలేపారని జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు.
Read More :