DELHI ORDINENCE| న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది.
మే 19న కేంద్ర ప్రభుత్వం జీఎన్సీటీడీ ఆర్డినెన్స్ను జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. ఈ అథారిటీలో ఢిల్లీ ముఖ్యమంత్రితోపాటు మరో ఇద్దరు బ్యూరోక్రాట్లు సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రాతిపదికన అథారిటీలో నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా వివాదం తలెత్తినట్లయితే ఎల్జీ తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ ఆర్డినెన్స్ ఎన్నికైన ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నదని ఢిల్లీ సర్కారు ఆరోపిస్తున్నది. ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.