న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి పేదల గోడు పట్టదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ధరల మంటపై మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రజల ఆదాయం కూడా పెరిగినందున ధరల పెరుగుదలపై ప్రజలు ఫిర్యాదు చేయకూడదని సిసోడియా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీజేపీ మంత్రి ప్రజల ఆదాయం పెరిగిందని చెబుతున్నారని కానీ బీజేపీ నేతల ఆదాయమే పెరిగిందని కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు ఎగబాకుతున్నాయని..ప్రజల ఇబ్బందులు పట్టించుకోని కాషాయ పాలకులు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడంతో కాషాయ పార్టీ పతనాన్ని ప్రజలు నిర్ధేశిస్తారని కపిల్ సిబల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై మంత్రి సిసోడియా మాట్లాడుతూ కేంద్రం ప్రజలకు అన్నీ ఉచితంగా ఇవ్వలేదని అంటూ గత కొన్నేండ్లుగా సామాన్యుడి ఆదాయం పెరిగిందని, దాంతో పాటు ధరల పెరుగుదలనూ ఆమోదించాలని వ్యాఖ్యానించారు.
“పదేండ్ల కిందట మీరు రూ 6000 సంపాదిస్తే ఇప్పుడు రూ 50,000 సంపాదిస్తున్నారు..అయినా పెట్రోల్, డీజిల్ ధరలు అప్పటి లాగానే ఉండాలని కోరుకోవడం సాధ్యం కాదు..అసలు ఆదాయం పెరగని వర్గమంటూ ఉందా” అని మంత్రి ప్రశ్నించారు. కాగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు చుక్కలు చూస్తుండటంతో పాటు వంట నూనెల ధరలు ఇటీవల రికార్డుస్ధాయిలో పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.