Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం శర్మ నుంచి ఇంతకంటే తాము ఆశించిందేమీ లేదని దుయ్యబట్టారు. అసోం ప్రభుత్వం ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినా తమ యాత్రను కొనసాగించి తీరుతామని ఎంపీ తేల్చిచెప్పారు. మతం, భాష ఆధారంగా బీజేపీ దేశాన్ని విభజిస్తోందని, భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా తాము దేశంలో ఐక్యతను చాటిచెబుతామని అన్నారు.
గువహటిలో అనుమతి లేకుండా యాత్రను చేపట్టి ఘర్షణలకు బాధ్యులయ్యారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై అసోం ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్కు చేరుకుంది. రాహుల్ యాత్ర అసోం నుంచి గురువారం ఉదయం బెంగాల్లోని కూచ్బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. మీ సమస్యలు విని మీకు సంఘీభావం తెలిపేందుకే ఇక్కడకు వచ్చానని, బెంగాల్కు రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్లు దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని హింస, అన్యాయం, అసమానతలు పెచ్చుమీరాయని చెప్పారు. ఇక అసోం మీదుగా సాగిన భారత్ జోడో న్యాయ యాత్ర గోలక్గంజ్ మీదుగా కూచ్బెహర్ జిల్లాలో బెంగాల్లో ప్రవేశించింది. అసోంలోని గౌరిపూర్లో ఎస్యూవీలో చేరుకుని రాత్రి అక్కడే బస చేసి బస్లో గోలక్గంజ్ చేరుకున్నారు. జనవరి 14న మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
Read More :
USA-UK | అమెరికా, బ్రిటన్ మధ్య చిచ్చు రాజేసిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ సలహా.. అసలేం జరిగిందంటే?