గువహటి : గోవధను నిషేధించడం, ఆలయాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో బీఫ్ విక్రయాలపై నిషేధం వంటి చర్యలతో బీజేపీ సమాజంలో మతపరమైన చీలికను తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని అసోం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా ఆరోపించారు. అసోం అసెంబ్లీలో తీసుకువచ్చిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదని అయితే ఈ విషయంలో వివక్ష చూపడం తగదని అన్నారు. ఆలయాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో బీఫ్ విక్రయాలను నిషేధించే ప్రతిపాదన తెచ్చారని అయితే ఇది అన్ని మతాలకూ వర్తింపచేయాలని అన్నారు.
మరోవైపు మసీదుల సమీపంలో పోర్క్ను నిషేధించాలని, పందులను వధించడంపై నిషేధం విధించాలని కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ చేసిన డిమాండ్ను బీజేపీ తోసిపుచ్చింది. పందులను హిందువులు లేదా ముస్లింలు ఎవరూ ఆరాధించరని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ దిలీప్ సైకియా అన్నారు. ఏ మతస్ధులూ పందులను పవిత్రమైనవిగా పరిగణించరని వ్యాఖ్యానించారు. పోర్క్ను బీఫ్తో పోల్చడం వెనుక ఎలాంటి తర్కం లేదని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ మతం కోణంలో చేసినదని ఆరోపించారు.