న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. 1998 జైన్ హవాలా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్లు చట్టవిరుద్ధమైనవని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అభివర్ణించారు. దర్యాప్తు ఏజెన్సీలను ఎలాంటి తప్పిదాలకు కేంద్రం ప్రేరేపించకుండా నిరోధించేందుకు సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేండ్లుగా సుప్రీంకోర్టు నిర్ధేశించిందని, కేంద్రం సుప్రీం ఉత్తర్వులకు విరుద్ధంగా ఆర్డినెన్సులు జారీ చేసిందని మనీష్ తివారీ పేర్కొన్నారు.
మేం (కేంద్రం) మిమ్నల్ని నియమించామంటే మా ఆదేశాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుందని ఈ ఆర్డినెన్స్ ఆయా అధికారులకు సంకేతం పంపిందని, విపక్షాలను వేధిస్తుంటే మీ పదవీకాలం ఏడికేడు పెంచుతామనేలా కేంద్రం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ దుయ్యబట్టారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేండ్ల పాటు పొడిగిస్తూ ఆదివారం రెండు ఆర్డినెన్సులను తీసుకువచ్చింది.