న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ను విడుదల చేసింది. గత 10ఏండ్లుగా మోదీ సర్కార్ దేశానికి అన్యాయం చేస్తున్నదని ఆరోపించింది. తన పదేండ్ల పాలనపై కేంద్రంలోని అధికార బీజేపీ తాజాగా పార్లమెంట్లో శ్వేతపత్రం (వైట్ పేపర్)ను విడుదల చేసింది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ‘10 సాల్ అన్యాయ్కాల్’ పేరుతో 54 పేజీల బ్లాక్ పేపర్ను విడుదల చేశారు.
‘ప్రధాని మోదీ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటి గురించి విపక్ష సభ్యులు మాట్లాడితే, పార్లమెంట్లో ప్రాధాన్యం ఇవ్వటం లేదు. అందుకే వాస్తవాల్ని ప్రజలకు తెలిపేందుకు బ్లాక్ పేపర్ను తీసుకొచ్చాం’ అని మీడియాతో మాట్లాడుతూ ఖర్గే అన్నారు. నిరుద్యోగం, ధరల కట్టడి, రైతుల సమస్యలను తీర్చటంలో కేంద్రం విఫలమైందని, బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రభుత్వాల్ని కుట్రపూరితంగా కూల్చుతున్నదని ఈ పత్రంలో కాంగ్రెస్ ఆరోపించింది.