న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేందుకు ఆమెకు అంశాలు కరువయ్యాయని అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు నేపధ్యంలో రైతులను ఉగ్రవాదులు, ఆందోళనకారులు, గూండాలని కాషాయ పార్టీ నేతలు నిందించినప్పుడు ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని ప్రియాంక గాంధీ నిలదీసిన క్రమంలో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
లఖింపూర్ సహా వివిధ అంశాల విషయంలో ప్రియాంక గాంధీ ప్రతిసారీ రాజకీయం చేశారని ఆదితి సింగ్ ఆరోపించారు. లఖింపూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోందని, సుప్రీంకోర్టు విచారిస్తోందని మరి ప్రియాంక ఏ వ్యవస్ధను విశ్వసిస్తారో తనకు అర్ధం కావడం లేదని రాయ్బరేలి ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టినప్పుడు వాటిని వ్యతిరేకించిన ప్రియాంక గాంధీకి ఇప్పుడు వాటిని రద్దు చేస్తే సమస్య ఏంటని నిలదీశారు. అసలు ప్రియాంక ఏం కోరుకుంటోందనేది స్పష్టంగా వెల్లడించాలని అన్నారు.