న్యూఢిల్లీ : పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు పాల్పడిందని దుయ్యబట్టింది. డ్రాగన్ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మెతకగా చైనాకు లొంగిపోవడం దారుణమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ట్వీట్ చేశారు.
ఇప్పటికైనా ప్రధాని, రక్షణ మంత్రి మేల్కొని చైనా దూకుడుపై నోరు మెదపాలని కోరారు. పాంగాంగ్ త్సోపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) భారీ, విశాలమైన బ్రిడ్జిని నిర్మిస్తోంది. ఈ రెండవ బ్రిడ్జి ద్వారా సాయుధ సైనిక వాహనాలు, ట్యాంకుల కదలికలను డ్రాగన్ చేపట్టే వెసులుబాటు కలుగుతుంది. కాగా తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా అక్రమ బ్రిడ్జి నిర్మాణంపై ఈ ఏడాది జనవరిలో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం అక్కడి పరిస్ధితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది. మరోవైపు చైనా రెండో బ్రిడ్జి నిర్మాణం చేపడుతోందనే వార్తలపై విపక్షం భగ్గుమంది. పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి నిర్మిస్తుంటే ప్రధాని, హోంమంత్రి సారధ్యంలోని బీజింగ్ జనతా పార్టీ నేతలు ఎన్నికల ర్యాలీలతో బిజీగా ఉన్నారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనం దాల్చడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాలక పక్షాన్ని నిలదీశారు. మన భూభాగం, మన సరిహద్దులు మరింత మెరుగైన కార్యాచరణను కోరుతున్నాయని వ్యాఖ్యానించారు.