న్యూఢిల్లీ : ఉచిత హామీలపై హాట్ డిబేట్ సాగుతున్న నేపధ్యంలో తాయిలాలపై కాంగ్రెస్, కాషాయ పార్టీల మధ్య డైలాగ్ వార్కు తెరలేచింది. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన వారు ఇప్పుడు ఉచితాలపై కొత్త పాట పాడుతున్నారని కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జీవాలా కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. ఉచితాలంటే ఎంటో బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ పది లక్షల కోట్ల మొండి బకాయిల మాఫీ ఉచితాల కిందకు రాదా అని నిలదీశారు. మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సో ఇతర అక్రమార్కుల రుణాల మాఫీ ఉచితాలా లేక కార్పొరేట్లు రూ 1,50,000 కోట్ల పన్ను రాయితీలు ఉచితాలా అని ప్రశ్నించారు. శ్రీలంకలో తన కార్పొరేట్ స్నేహితుడి వ్యాపారానికి సాయం చేసేందుకు ప్రధాని జోక్యం చేసుకోవడం ఉచితాల కిందకు వస్తుందా అని నిలదీశారు.
ఎన్సీఎల్టీలో ఉన్న 3.2 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడవడం ఉచితం కాదా అని రణ్దీప్ సుర్జీవాలా ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ స్నేహితులకు కారు చౌకకు దోచిపెట్టడం ఉచితమా అనుచితమా అంటూ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్ధ మీకు ఉచితంగా కనిపిస్తోందా..? పేదలకు ఉచిత, సబ్సిడీ ఆహారం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడం మీకు తాయిలంగా తోస్తోందా అని నిలదీశారు. అసలు ఏది సంక్షేమ పధకం, ఏది ఉచితమో కొద్దిమందితో కూడిన నిపుణుల కమిటీ ఎలా నిర్ధేశిస్తుందని ప్రశ్నించారు.