న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య ప్రతిష్టంభన (India-Canada Row) నెలకొన్న నేపధ్యంలో పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ వాదాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అయితే అదే సమయంలో తమ యువతను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తమ యువత ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు.
కెనడాలోని భారత విద్యార్ధుల భద్రతపై అన్ని చర్యలూ చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. పార్లమెంట్లో గురువారం తాను ప్రధాని మోదీతో ఈ విషయంపై చర్చించానని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన అనంతరం భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి.
కెనడాలో వీసా సేవలను భారత్ నిలిపివేసింది. మరోవైపు కెనడా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. కెనడా తన ఆరోపణలను బలపరిచే ఎలాంటి ఆధారాలనూ సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Read More :