లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. మహిళలు, బాలికల సంక్షేమం కోసం ఇప్పటికే పలు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా శుక్రవారం యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను ప్రకటించింది. యూత్ మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ విడుదల చేశారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలతో పాటు, 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఉద్యోగాలతో పాటు 30 ఏండ్ల లోపు యువతను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు స్టార్టప్ల కోసం రూ 5000 కోట్లతో సీడ్ స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యోగి హయాంలో ఇప్పటివరకూ 16 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. ప్రతి గంటకు రాష్ట్రంలో 880 మంది యువకులు కొలువులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువశక్తితో నవ యూపీని ఆవిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తాము విద్వేషాన్ని ప్రేరేపించబోమని, యువతలో నూతన స్ఫూర్తి నింపుతామని అన్నారు.
ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా, అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని ప్రయత్నిస్తోంది. ఇక ప్రియాంక గాంధీ సారధ్యంలో సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది.. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.