”ప్రశాంత్ కిశోర్ కచ్చితంగా మన పార్టీలోకి వస్తారు. 2024 ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఆయన్ను రాజకీయ సలహాదారుగా ఎవ్వరూ చూడొద్దు… ఆయన మన పార్టీ మనిషే. పార్టీ నేతగానే ఆయన ఇకపై విధులు నిర్వర్తిస్తారు”…… ఇవీ పీకే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్లతో అన్న మాటలు. మరి కొన్ని రోజుల్లో పీకే కచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని పార్టీ సీనియర్లు కూడా ప్రకటించారు. మరోవైపు… ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే మూడు మార్లు అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయ్యారు. ఓ రోడ్ మ్యాప్ను కూడా సోనియాకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆ రోడ్ మ్యాప్పై చర్చించడానికి సోనియా గాంధీ వరుసగా పార్టీ సీనియర్లతో సమావేశమవుతున్నారు. రోడ్ మ్యాప్ సాధ్యా సాధ్యాలపై చర్చిస్తున్నారు.
ఇందులో భాగంగా సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ సీఎం గెహ్లోత్, చత్తీస్గఢ్ సీఎం భాగేల్తో సమావేశమయ్యారు. పీకే రోడ్మ్యాప్పై చర్చించారు. పీకే కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని సోనియా వీరితో చెప్పినట్లు తెలుస్తోంది. మొదట పీకేకి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ ఇద్దరు సీఎంలతో భేటీ అయ్యారని ఢిల్లీ నేతలు అంటున్నారు.