న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరో నేడు తేలనుంది. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఏఐసీసీ ఇప్పటికే ఏర్పాటు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 వేల మందికి పైగా ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరుగడం విశేషం. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గే పోటీపడ్డారు. అయితే ఖర్గేకి గాంధీ కుటుంబం పూర్తిస్థాయిలో మద్దతు ఉందని ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఖర్గేకి ఓటెయ్యాలని అన్ని పీసీసీలకు పార్టీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.