న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల కోసం నిధుల సేకరణను సోమవారం ప్రారంభించింది. ‘దేశం కోసం విరాళం ఇవ్వండి’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రజలను విరాళాలు అడగడం ఇదే తొలిసారి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 138 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో, రూ.138 లేదా రూ.1,380 లేదా రూ.13,800 విరాళంగా ఇవ్వాలని ఆ పార్టీ వెబ్సైట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాలు ఈ నెల 28న జరుగుతాయి. అప్పటి వరకు విరాళాల సేకరణను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, కనీసం రూ.138 విరాళం ఇవ్వాలని ప్రజలను కోరుతారు.