బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు భీకర స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ.. బెంగుళూరులో భారీ స్థాయిలో రోడ్ షో నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో ఆయన రోడ్షో నిర్వహించారు. కానీ కర్ణాటక ఓటర్లు మాత్రం బీజేపీకి మొండి చెయ్యి చూపించారు. పేద ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి.. బీజేపీపై ఉన్న కసిని చూపించారు.
పేద, మధ్య తరగతి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్ధానాలు చేసింది. ఆ ప్రామిస్లతో ఓటర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. నేరుగా నగదు బదిలీ, ఉచిత విద్యుత్తు వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చాయి. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. కీలకమైన ఆ ప్రాంతంలో బీజేపీ పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆ పార్టీకి నష్టాన్ని తెచ్చింది.
ఓట్ షేరింగ్లో ప్రజావ్యతిరేకత చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో స్థానంలో ఉన్న బీజేపీకి కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్షేర్లో ఉన్న వ్యత్యాసం ప్రజావ్యతిరేకతకు సంకేతంగా నిలిచింది. బీజేపీ కన్నా దాదాపు 9 శాతం అధిక ఓట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గమనార్హం. 2018 ఎన్నికలతో పోలిస్తే దాదాపు అయిదు శాతం అధిక ఓట్లను కూడా కాంగ్రెస్ తన ఖాతాలోకి వేసుకుంది.
లింగాయత్ ఓట్లను గెలుచుకోవడంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. సాధారణంగా బీజేపీకి ఎప్పుడూ అనుకూలంగా ఉండే లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్కు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. యడ్యూరప్పను నాయకత్వం నుంచి తప్పించిన నాటి నుంచి బీజేపీలో సమస్యలు మొదలయ్యాయి. బొమ్మైను సీఎంగా చేసినా.. ఆ పార్టీలో మాస్ లీడర్ సమస్య ఏర్పడింది. దీంతో కర్ణాటకలో కమల దళానికి ఓటమి తప్పలేదు. బీజేపీ నుంచి యడ్యూరప్ప తప్పుకోవడం.. కాంగ్రెస్లో సిద్ధిరామయ్య పుంజుకోవడంతో.. కర్ణాటక లింగాయత్లు కాంగ్రెస్ పార్టీ వైపే బాటకట్టారు.
ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు బీజేపీ వేసిన ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. దాదాపు 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆ ఎత్తుగడలో పార్టీ విఫలమైంది. అనేక మందికి కొత్తగా సీట్లు ఇచ్చినా.. వాళ్లు దాదాపు ఓటమిపాలయ్యారు. అవినీతిపై కాంగ్రెస్ పోరాడినా తీరు కూడా బీజేపీని నిర్వీర్యం చేసింది. బీజేపీ నేతలు ఆ ఆరోపణలను ఎదుర్కొనలేకపోయారు. 40% కమిషన్ లాంటి పంచ్లకు బీజేపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ప్రకటించిన ఉచితాలను ఎదుర్కోవడంలోనూ బీజేపీ ఆలస్యం చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ దూకుడు ప్రచారం ఆ పార్టీకి కలిసివచ్చింది.