న్యూఢిల్లీ: తమిళనాడు సీఎంగా విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ స్టార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే ఇద్దరికి సంబంధించిన ఓ రీల్ను ఇన్స్టాగ్రామ్(Instagram Reel)లో అప్లోడ్ చేశారు. కానీ ఆ రీల్తో పాటు ఓ ఫోటోను కేంద్రం బ్లాక్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆ పోస్టును అడ్డుకున్నట్లు విమర్శించారు. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. ఇన్స్టాగ్రామ్లో తలెత్తిన సమస్యతో తమకు సంబంధం లేదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. ఆ ప్లాట్ఫామ్లో తలెత్తిన అంతర్గత సమస్య వల్ల.. పోస్టు ఫ్లాగింగ్ బ్లాక్ అయినట్లు ఆ శాఖ వెల్లడించింది.
ఆదివారం చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ ఈవెంట్కు రాహుల్ గాంధీ వెళ్లారు. ఇక తన సోషల్ మీడియా అకౌంట్లో రాహుల్ అనేక ఫోటోలను షేర్ చేశారు. ఫ్లాగింగ్ను బ్లాక్ చేయడం పట్ల కాంగ్రెస్ నేత శ్రీవత్స తన ఎక్స్ అకౌంట్లో ఆరోపించారు. విజయ్తో కలిసి చేసిన రాహుల్ గాంధీ ఇన్స్టా రీల్ను కేంద్రం బ్లాక్ చేసిందని ఆరోపించారు. ఆ రీల్కు గంటలోనే సుమారు 12 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయని, ఇక వైరల్ ఫోటోను సుమారు 46 మిలియన్ల మంది లైక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ ఎందుకు యాక్సిస్ కాలేదన్న విషయాన్ని మెటా కంపెనీ వెల్లడించలేదని, ఎలక్ట్రానిక్స్.. ఇన్పర్మేషన్ టెక్నాలజీ శాఖ రూల్ వల్ల ఆ సమస్య వచ్చిందని, రాహుల్ గాంధీ సోషల్ మీడియా అకౌంట్ను నొక్కిపెట్టారని, ఆయనకు చెందిన ఎక్స్, యూట్యూబ్ వ్యూస్, ఇన్స్టా ఫాలోవర్ల వివరాలను దాచి పెడుతున్నారని ఆరోపించారు. దేశ విపక్ష నేత గొంతును నొక్కేస్తున్నారని శ్రీవత్స ఆరోపించారు.
రాహుల్ గాంధీ అకౌంట్లను దాచిపెడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ప్లాట్ఫామ్ అంతర్గత సమస్య వల్ల అలా జరిగి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.