ద్వాపరయుగంలో ధర్మరక్షణకై శ్రీమహావిష్ణువు ‘వేదవ్యాసుని’గా అవతరిస్తే, ఈ కలియుగంలో సాక్షాత్ పరమేశ్వరుడే శ్రీశంకర భగవత్పాదుల రూపంలో జన్మించినట్లు ‘భవిష్య పురాణం’ పేర్కొన్నది. వ్యాసుడు ‘బ్రహ్మసూత్రాలు’, ‘అష్టాదశ మహాపురాణాలు’ మొదలుగాగల అనేక గ్రంథాలను రచించి, సనాత ధర్మాన్ని వ్యవస్థీకృతం చేశాడు. శంకరులు నాలుగు వేదాలకు ప్రతీకలు వంటివారిని తన శిష్యులుగా చేసుకొని, వారిద్వారా భారతావని నలుదిశలా ‘అద్వైత సిద్ధాంతాన్ని’ ప్రతిష్ఠించారు. కేరళలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు శివారాధనవల్ల సాక్షాత్తు శంకరుడే పుత్రుడిగా జన్మించారు. మూడవయేట వీరి తండ్రి మరణించగా, తల్లి తానే సర్వస్వమై విద్యాబుద్ధులు నేర్పించింది. ఐదవ ఏట ‘ఉపనయన సంస్కారం’ జరిగింది. కొద్దిరోజులలోనే సమస్త వేదశాస్ర్తాలను బాలశంకరులు పూర్తి చేశారు. ఒకరోజు పూర్ణానదిలో శంకరులు స్నానం చేస్తుండగా, ఒక పెద్ద మొసలి (సంసారానికి ప్రతీక) వారి కాలు పట్టుకుంది. వయసుకే బాలుడు కానీ, తాను సర్వం తెలిసినవారే కదా. అప్పుడు తల్లికి విషయం చెప్పారు- “అమ్మా! ఈ మొసలి నన్ను వదలదు. ఈ రోజుతో నా ఆయుష్షు తీరింది. నా ప్రాణాలు కొద్దిక్షణాలలో పోతాయి.” అన్నాడు. ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. మళ్లీ శంకరులే అన్నారు- “అమ్మా! ఒకవేళ నేను సన్యాసం తీసుకోవడానికి నువ్వు అనుమతిస్తే ఈ మొసలి నన్ను వదిలేస్తుంది. నీకిష్టమైనా?” ‘బిడ్డ జీవిస్తే అంతే చాలు’ అనుకొని సన్యాస స్వీకారానికి అనుమతించింది. ఫలితంగా, లోకానికే ఒక మహాపురుషుడు లభించాడు.
‘సన్యాసులు ఇంట్లో ఉండరాదని’ తల్లిని ఒప్పించిన శంకరులు, ఆమె అనుమతితోనే ఇల్లు వదిలి నర్మదా నదీతీరంలో శ్రీగోవింద భగవత్పాదులవారి ని దర్శించుకున్నారు. వారివద్ద ‘సన్యాసాశ్రమం’ స్వీకరించారు. అనంతరం వారణాసి చేరుకొని, ‘ప్రస్థాన త్రయ’ భాష్యరచన చేశారు. సమస్త అవైదిక మతాలను ఖండించి, వేదసమ్మతమైన ‘అద్వైత సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించారు. వారణాసిలో శంకరులకు వ్యాసభగవానుడు దర్శనం ఇచ్చి, ‘అద్వైతమే సర్వజనామోదం పొందుతుందని’ ఆశీర్వదించినట్లు వినికిడి. వారణాసిలో శ్రీపద్మపాదులవారు శంకరులకు శిష్యులుగా చేరారు. ‘బ్రహ్మావతార స్వరూపుడు’గా భావించే మండనమిశ్రుడిని వాదనలో జయించాక, వారిని శిష్యులుగా చేర్చుకొని సన్యాసాశ్రమం ఇవ్వగా, ఆయనే ‘సురేశ్వరాచార్యులు’గా ప్రసిద్ధి చెందారు. వారి ధర్మపత్ని శారదాదేవిని తాను స్థాపించబోయే పీఠాలకు ‘అధిష్ఠాన దేవత’గా ఉండమని శంకరులు కోరగా, ఆ జగన్మాత దానికి అంగీకరించింది. తర్వాత హస్తామలక, తోటకులు ఉభయులూ శిష్యులయ్యారు. ‘చతుర్భిస్సహశ్యిస్తు శంకరోవతరిష్యతి’. నాలుగు వేదాల స్వరూపులైన వారు శంకరులకు శిష్యులుగా చేరారు. వారే భగవత్పాదుల ఆధ్వర్యంలో భారతావనికి, మానవాళికి ధార్మిక దిశానిర్దేశనం చేశారు.
శ్రీశంకర భగవత్పాదులవారు శిష్యులతోసహా దేశమంతా విజయయాత్ర చేస్తూ, వేదవిరుద్ధ మతాలను ఖండించారు. అదే సమయంలో వైదికమత స్థాపనతో ‘అద్వైత సిద్ధాంత ప్రతిష్ఠాపన’ చేయడానికి భారతదేశంలోని నాలుగు దిక్కులలోని నాలుగు ఉత్కృష్టమైన దివ్యప్రదేశాలను ఎన్నుకొన్నారు. చతుర్వేదాలకు ప్రతీకలుగా ఆయా చోట్ల నాలుగు ధర్మపీఠాలను స్థాపించారు. అవి: తూర్పున పూరిలో గోవర్ధన పీఠం (ఋగ్వేద ప్రధానం: హస్తామలకాచార్యులు), దక్షిణాన శృంగేరీలో శ్రీశారదాపీఠం (యజుర్వేద ప్రధానం: సురేశ్వరాచార్యులు), పశ్చిమాన ద్వారక పీఠం (సామవేద ప్రధానం: శ్రీపద్మపాదాచార్యులు), ఉత్తరాన బదరీనాథ్లో జ్యోతిర్పీఠం (అధర్వణవేద ప్రధానం: తోటకాచార్యులు). ఇలా నాలుగు వేదాల సిద్ధాంతాలను నాలుగు దిక్కులలో ప్రతిష్ఠింప జేయడం ద్వారా అఖండ భారతదేశంలో మానవుల హితం కోసం శ్రౌతస్మార్త ధర్మానుష్ఠానాన్ని శంకరులు ప్రబోధించారు. అదే వారి అవతార పరమార్థం.
శాస్ర్తుల వేంకటేశ్వరశర్మ
98499 09165