న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఉభయసభలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు సభా కార్యక్రమాలను సాగనివ్వడం లేదు. ఈ ఘటనల పట్ల ప్రధాని మోదీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టంభను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కావాలనే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశాన్ని నిషేధించింది. దాంతో పాటు ఇతర పార్టీలను కూడా ఆ సమావేశానికి వెళ్లకుండా చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ఆ పార్టీపై తన అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కొత్త మంత్రులను పరిచయం చేస్తున్న సమయంలో కూడా విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అనుచిత ప్రవర్తనను మీడియాతో పాటు పబ్లిక్ ముందు బయటపెట్టాలని ప్రధాని మోదీ తన పార్టీ ఎంపీలకు సూచించారు. పెగాసస్ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు సభలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.