న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి సంచలన ఆరోపణలు చేశారు. మోదీ, దీదీ ఇద్దరూ కాంగ్రెస్ ముక్త్ భారత్ను కోరుకుంటున్నారని అన్నారు. ఈ రహస్య ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు వారు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు రహస్యంగా మంతనాలు జరుపుతారని అధీర్ రంజన్ ఆరోపించారు.
డార్జలింగ్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, గవర్నర్లతో తేనీటి విందులో మమతా బెనర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ దీదీకి ఇవన్నీ మామూలేనని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లును ఎలా ప్రయోగించాలనే దానిపై కూడా మోదీ, దీదీలు రహస్య మంత్రాంగం నెరుపుతారని ఆరోపించారు. దేశ రాజదానిలో ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆహ్వానించడాన్ని ప్రస్తావిస్తూ తనకు మెజారిటీ ఉందని తాను ఏమైనా చేయవచ్చని ప్రధాని మోదీ అనుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ లోపల తామంతా ఒకటేనని, తమందరికీ స్పీకర్ అధిపతి అని స్పష్టం చేవారు. జాతీయ చిహ్నాన్ని స్పీకర్ లేదా రాష్ట్రపతి ఎందుకు ఆవిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ నూతన భవనాన్ని వారు అలా ప్రారంభించదలుచుకుంటే వారికి రాజ్యాంగం, పార్లమెంట్ పట్ల ఎలాంటి గౌరవం లేదని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యానించారు.