Rahul Gandhi: రాజ్యాంగాన్ని మార్చేంతటి సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతో హడావిడి చేస్తోందిగానీ రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీ వల్ల కాదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో రాహుల్గాంధీ మాట్లాడారు.
రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీకి మూడో వంతు మెజార్టీ అవసరమని, అందుకు తగ్గ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని ఆ పార్టీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇవాళ్టి ముంబై సభలో పైవిధంగా స్పందించారు.
‘సత్యం, ప్రజల మద్దతు మన వైపే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పోరు బీజేపీ, కాంగ్రెస్ల నడుమ కాదు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ ఇది. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని వాళ్లు అనుకుంటే.. అధికార వికేంద్రీకరణ జరగాలని మేం భావిస్తాం. రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు జ్ఞానం ఉండదని కాషాయ శ్రేణులు విశ్వసిస్తాయి. ఓ వ్యక్తి ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన, అతడు రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ దేశంలోని 5 నుంచి 10 శాతం మంది కోసం పనిచేస్తుందని, మిగతా జనాన్ని వాళ్లు పట్టించుకోరని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆ 5 నుంచి 10 శాతం మంది కాకుండా దేశంలోని మిగతా 90 శాతం మంది సామాన్య ప్రజానీకం సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు.
కాగా, మణిపుర్ నుంచి మొదలైన రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 16న సాయంత్రం ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ స్మారక చైత్యభూమికి చేరుకున్న తర్వాత ముగిసింది. 63 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా శివాజీ పార్కులో భారీ సభ నిర్వహించారు.