రాంచీ, ఫిబ్రవరి 10: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ను ఈడీ శనివారం దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించింది. ఇటీవల జార్ఖం డ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను అరెస్టు చేసిన భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనే సాహూను విచారించినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా విచారణకు రావాలని సూచించారు.
హేమంత్ సొరేన్ ఢిల్లీ నివాసం లో స్వాధీనం చేసుకొన్న లగ్జరీ కారు తో సంబంధాలపై ఈడీ సాహూ స్టేట్మెంట్ను తీసుకొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆ కారు, కారులో పట్టుబడిన నగదుతో తనకు సంబం ధం లేదని ఈడీ విచారణ తర్వాత ధీరజ్ సాహూ పేర్కొన్నారు. ధీరజ్ కుటుంబానికి చెందిన డిస్టిలరీ కంపెనీలో గత డిసెంబర్లో ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.351.8 కోట్లు నగదు పట్టుబడిన విషయం తెలిసిందే.