MSP : డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన బాట పట్టిన నేపధ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ మోదీ సర్కార్ను కోరింది. రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎంఎస్పీపై చట్టాన్ని తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చి మూడేండ్లయినా ఇప్పటివరకూ నెరవేరలేదని అన్నారు. 2021లో నాలుగు నల్ల వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించిన సమయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిందని మనీష్ తివారీ గుర్తుచేశారు.
రైతుల పంటలకు ఎంఎస్పీ భరోసా ఇస్తూ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంతంగా నిరసన చేపడుతున్న రైతులపై అణిచివేత చర్యలను నిలిపివేయాలని తివారీ కోరారు. రైతుల ఆందోళనకు బారికేడ్లు, బుల్లెట్లు, లాఠీచార్జీలు సమాధానం కాదని కాంగ్రెస్ ఎంపీ హితవు పలికారు.
Read More :