బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద కాషాయ జెండా ఎగురుతుందన్న రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీ శివకుమార్తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప, అసెంబ్లీ స్పీకర్, కొందరు మంత్రులు వెంటనే అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ససేమిరా అన్నారు. మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో సీఎం బసవరాజ్ బొమ్మె, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసనను విరమించుకోవాలని ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే వారు అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడతామని చెప్పారు. నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.