బెంగళూర్ : సమాజంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఆరోపించారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులందరూ రాబోయే రోజుల్లో ఆరెస్సెస్తో మమేకమవుతారని కర్ణాటక మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్షద్ కాషాయ పార్టీపై మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీలో మంత్రి చేసిన వ్యాఖ్యలను అర్షద్ ప్రస్తావిస్తూ శాంతి భద్రతలు నిర్వీర్యమై మతఘర్షణలు చెలరేగే పరిస్ధితిని సృష్టించేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాబోయే ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తాపత్రయపడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా ప్రజలు ఆ పార్టీకి ఓటు వేసే పరిస్ధితి లేదని దుయ్యబట్టారు. బీజేపీ సర్కార్ పలు లావాదేవీలపై 40 శాతం కమిషన్ తీసుకుంటోందని ఆరోపించారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం డబ్బు దండుకోవడం మినహా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధానికి లేఖ రాసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. దిక్కుతోచని స్ధితిలో కాషాయ నేతలు శాంతిభద్రతల పరిస్దితిని దిగజార్చి మతకల్లోలాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమకు దేశ రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ పేర్కొన్నారు.