బెంగళూరు, డిసెంబర్ 15: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ జగడంలో ‘టిప్పు సుల్తాన్’ మరోసారి కేంద్ర బిందువుగా మారారు. మైసూర్లోని ‘మందకల్లి ఎయిర్పోర్టు’ పేరును టిప్పు సుల్తాన్ ఎయిర్పోర్టుగా మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ అబ్యయ్య ప్రతిపాదనలు చేయడం దుమారం రేపింది. అసెంబ్లీలో గురువారం విమానాశ్రయాల పేర్ల మార్పు అంశంపై చర్చ సమయంలో ఆయన చేసిన ఈ ప్రకటనను ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు.
సభలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదనలు జరిగాయి. అయితే మైసూర్ కాకుండా.. హుబ్బళ్లి, బెళగావి, శివమొగ్గ, విజయపుర విమానాశ్రయాల పేర్లను మార్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదింపజేసుకొన్నది.