జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యే తనతో బూట్లు నాకించాడని, పోలీస్ అధికారి కొట్టడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేసినట్టు ఒక దళిత వ్యక్తి (Rajasthan Dalit man) ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేతోపాటు పోలీస్ అధికారిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.
జూన్ 30న తాను పొలంలో పని చేస్తుండగా కొందరు పోలీసులు తనను కొట్టి ఒక గదిలోకి తీసుకెళ్లారని జైపూర్కు చెందిన 51 ఏండ్ల దళిత వ్యక్తి తెలిపాడు. డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ తనను కొట్టడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా పేరు చెప్పి తనను బెదిరించారని, అలాగే ఆ ఎమ్మెల్యే తనతో బలవంతంగా బూట్లు నాకించినట్టు చెప్పాడు. అంతేగాక ఆ ఎమ్మెల్యే, డీఎస్పీ తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని వాపోయాడు.
కాగా, భయపడిన బాధిత దళిత వ్యక్తి సుమారు నెల రోజుల తర్వాత జూలై 27న దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వారు పట్టించుకోలేదు. సీనియర్ పోలీస్ అధికారుల వద్దకు వెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా, డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ్పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో క్రైం బ్రాంచ్ పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.