న్యూఢిల్లీ : రక్షణ బలగాల్లో న్యూ రిక్రూట్మెంట్ స్కీం అగ్నిపథ్పై హింసాత్మక నిరసనల నడుమ కాంగ్రెస్ ఎమ్మెల్య ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పధకంలో శిక్షణ అనంతరం యువత ఆయుధాలు చేపడతారని, దేశంలో రక్తపాతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల్లో అగ్నివీరుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటన చేసింది. త్రివిధ దళాల్లో 17 ఏండ్ల నుంచి 21 ఏండ్ల వయసు వారిని కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేండ్ల పాటు సర్వీసులోకి అనుమతిస్తారు.
వీరిలో 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మంది ఆర్మీ నుంచి కొద్దిపాటి ప్రయోజనాలతో బయటకు వస్తారు. అయితే నాలుగేండ్ల శిక్షణ తర్వాత యువత ఏం చేస్తుందని, వారు తుపాకులు చేతపడతారని ఇది దేశంలో రక్తపాతానికి దారితీస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ పేర్కొన్నారు.
అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలని లేకుంటే దేశంలో హింస చెలరేగుతుందని వ్యాఖ్యానించారు. గత ఏడేండ్లుగా ప్రధాని మోదీ ఎలాంటి ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకురాలేదని ఇప్పుడు ఆర్మీని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. యువత ఇప్పుడు వీధుల్లో నిరసనలకు దిగిందని, అగ్నిపథ్ను ఎట్టి పరిస్ధితుల్లో అమలు కాబోనీయమని స్పష్టం చేశారు.