జైపూర్ : రాజస్థాన్కు చెందిన మంత్రి రాజేంద్ర గుధా ఓ విషయాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటేస్తే.. రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని రాజేంద్ర ప్రకటించారు. అంతే కాకుండా 2020లో అశోక్ గెహ్లాట్పై తిరుగుబాటు చేసిన సందర్భంగా, ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తే రూ. 60 కోట్లు ఇస్తామని తనను కొందరు సంప్రదించారని రాజేంద్ర గుధా స్పష్టం చేశారు. ఈ రెండు ఆఫర్లను తాను తిరస్కరించానని గుధా తేల్చిచెప్పారు. రాజస్థాన్లోని జుంజుహునులోని ఓ ప్రయివేటు స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని రాజేంద్ర గుధా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాజేంద్ర పై విధంగా బదులిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే రాజ్యసభ ఎన్నికలప్పుడు వచ్చిన ఆఫర్ గురించి తన భార్యకు చెప్పానని తెలిపారు. ఆమె తిరస్కరించారని పేర్కొన్నారు. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు సీఎంకు వ్యతిరేకంగా పని చేస్తే రూ. 65 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చినప్పుడు, తన భార్యాపిల్లలను అడిగాను. డబ్బు ప్రధానం కాదు.. మంచిగా ప్రవర్తించడం ముఖ్యమని చెప్పినట్లు గుధా పేర్కొన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే.. మీ చుట్టూ ఉండే వారు మంచి విషయాలు చెప్పినప్పుడు అంత బాగానే ఉంటుందన్నారు రాజేంద్ర గుధా. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.