షహరాన్పుర్: నేటి భారత్కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నదని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ప్రధాని మోదీ తొలిసారి కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై స్పందించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్వాతంత్రోద్యమం నాటి ముస్లిం లీగ్ ఆనవాళ్లు ఉన్నాయని, కొంత భాగం లెఫ్టిస్ట్ భావజాలం నిండి ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. యూపీలోని షహరాన్పుర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ స్వతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ కథ కొన్ని దశాబ్ధాల క్రితమే ముగిసిందని ప్రజలు అనుకుంటున్నారని మోదీ తెలిపారు. ఆశలు, ఆశయాలు లేని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోతో దేశాన్ని ముందుకు నడిపించలేదన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వద్ద ప్రణాళికలు లేవని, దేశ ప్రగతి పట్ల విజన్ కూడా లేదని మోదీ అన్నారు.