కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి చోటా ఆ పార్టీ ఎలాంటి దుస్థితి అనుభవిస్తుందో కూడా ఈ ఎన్నికలు కళ్లకు కట్టాయి. రాహుల్ ప్రచారం చేసిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. ఇక మూడో ఫ్రంట్ అయితే పోటీ చేసిన వాటిలో 85 శాతం స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం గమనార్హం.
మూడో ఫ్రంట్ నుంచి పోటీ చేసిన వాళ్లలో మొత్తం 292 స్థానాలకుగాను కేవలం 42 మంది మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారని ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన న్యూస్ 18 చానెల్ వెల్లడించింది. మొత్తం ఓట్లలో ఓ అభ్యర్థి కనీసం 16.5 శాతం ఓట్లు పొందకపోతే ఆ వ్యక్తి తాను చెల్లించిన డిపాజిట్ కోల్పోతారు. దశాబ్దాల పాటు బెంగాల్ను ఏలిన లెఫ్ట్తోపాటు కాంగ్రెస్ కూడా కనీసం ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మాత్రం ఒక్కదాంట్లో గెలిచింది.
కాంగ్రెస్కు ఇంకా జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే.. తమ పార్టీ నేత, యువరాజు రాహుల్గాంధీ ప్రచారం నిర్వహించిన నక్సల్బరీ, గోల్పోఖర్ స్థానాలు రెండింట్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. విచిత్రమేమిటంటే నక్సల్బరీ స్థానం పదేళ్లుగా కాంగ్రెస్ దగ్గరే ఉంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ మాలాకర్ మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయనకు కేవలం 9 శాతం ఓట్లు వచ్చాయి.
గోల్పోఖర్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా 12 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు.
మొత్తంగా చూస్తే లెఫ్ట్ 170 స్థానాల్లో పోటీ చేసి కేవలం 21 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ 90 స్థానాలకు గాను 11, ఐఎస్ఎఫ్ 30కిగాను 10 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నాయి. ఐఎస్ఎఫ్ కాస్త నయం. ఒకదాంట్లో గెలిచి, నాలుగు స్థానాల్లో రెండోస్థానంలో నిలిచింది.