లక్నో: దేశ విభజనకు కాంగ్రెస్, నాటి నేతలతోపాటు జిన్నా కారణమని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో మొరాదాబాద్లో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ విభజన ముస్లింల వల్ల జరగలేదని, జిన్నా వల్ల జరిగిందని తెలిపారు. నాడు ప్రభావవంతమైన నవాబులు లేదా డిగ్రీ హోల్డర్లు ఉన్న ముస్లింలు మాత్రమే ఓటు వేసే స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ విభజనకు ముస్లింలు కారణం కాదన్న ఒవైసీ, కాంగ్రెస్, నాటి నేతలతోపాటు జిన్నా దీనికి కారణమన్నారు. ఇది చదవని ఆర్ఎస్ఎస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీకి తాను ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు.
కాగా, ప్రస్తుతం కాస్గంజ్ సంఘటన మీ ముందు ఉన్నదని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పోలీస్ స్టేషన్లోని 2.5 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాప్కు అల్తాఫ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి తండ్రికి పోలీసులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. కాస్గంజ్ పోలీసులే ఆ యువకుడ్ని హత్య చేశారని ఆరోపించారు. మీకు హత్య చేయడం తప్ప దర్యాప్తు చేయడం తెలియదంటూ యూపీ పోలీసులను విమర్శించారు.