Madhya Pradesh : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. పరీక్షకు వెళ్తున్న అక్కా తమ్ముడిని తండ్రి సోదరుడు, అతడి కొడుకు కలిసి చంపేశారు. ఈ ఘటన సెహోర్ జిల్లా, ధర్మపురి గ్రామలో శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు జరిగింది. మృతులను శీతల్ (20), కుల్దీప్ (19)గా గుర్తించారు. వీరిద్దరూ ఉదయం తమ హాల్ టిక్కెట్లు తీసుకుని పరీక్షా కేంద్రానికి బయలుదేరారు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న వారి తండ్రి సోదరుడు హరి సింగ్, అతడి కొడుకు కలిసి దాడి చేశారు. రోడ్డుపై ఇద్దరిని అడ్డగించి, తలలపై, ఇతర శరీర భాగాలపై పెద్ద కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శీతల్, కుల్దీప్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. దీంతో ఇద్దరూ ఘటన జరిగిన స్తలంలోనే పడిపోయి, కొద్దిసేపటికే మరణించారు. స్థానికులు వైద్య సహాయం కోసం ఎదురుచూసేలోపే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల ఇంటికి దగ్గర్లోనే, ఇంటి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే జరిగింది. హత్య చేసిన తర్వాత నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న సిద్ధిక్ గంజ్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు.
తమ పిల్లల హత్యపై తండ్రి జగదీష్ స్పందించారు. ఆస్తి వివాదం నేపథ్యంలోనే నిందితులు ఈ హత్య చేశారని ఆరోపించాడు. తమకు, సోదరుడి కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలున్నాయని చెప్పారు. కావాలనే ఇంత దారుణానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మరోవైపు ఈ హత్యతో మృతుల బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ దీపక్ శుక్లా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.