న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఆరోపించారు. గవర్నర్ వ్యవస్దను కాషాయ సర్కార్ దిగజార్చుతున్న వైనాన్ని వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వ పనితీరు ఇదేనంటూ మండిపడ్డారు.
కేరళ సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ మొయిలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బేరసారాలకు దిగడం లేదంటే గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శలు గుప్పించారు.
రాజకీయాలకు అతీతంగా తటస్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చివేసేందుకు బీజేపీ పెద్దలు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన ఉదంతాలను వీరప్ప మొయిలీ ప్రస్తావించారు.