షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవిని ఎవరిని వరించబోతున్నదనే సస్పెన్స్కు తెరపడింది. హిమాచల్ కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖునే సీఎం పదవి వరించింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పేరునే ఖరారు చేసింది. అదేవిధంగా ముఖేశ్ అగ్నిహోత్రి పేరును డిప్యూటీ సీఎంగా ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ మీడియాకు వెల్లడించారు.
ఇద్దరు నేతలు రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నది. అంతకుముందు సీఎం ఎవరనే విషయంలో తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహోత్రి ముగ్గురూ ఎవరికి వారే సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు.
చివరికి కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్విందర్ సింగ్ పేరును సీఎంగా ఖరారు చేసింది. మరో నేత ముఖేశ్ అగ్నిహోత్రికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి సంతృప్తి పర్చింది. ఇక లోక్సభ సభ్యురాలిగా ఉన్న ప్రతిభాసింగ్కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి నచ్చజెప్పింది. దాంతో గందరగోళానికి దారి తీస్తుందనుకున్న హిమాచల్ సీఎం ఎంపిక హైడ్రామా సుఖాంతంగా ముగిసింది.