న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్రీరామనవమి సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో దేశ ప్రజలు అలసిపోయారన్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయంటూ ఈ మేరకు మంగళవారం ఓ ట్వీట్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడని పిలుస్తారని, అది స్వచ్ఛతకు చిహ్నమన్నారు.
రామనవమి రోజున అసహనం, హింస, ద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా.. మధ్య ప్రదేశ్లోని ఖర్గోన్లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హింసాకాండ చెలరేగింది. శోభాయాత్రపై కొందరు దుండగులు దాడి చేయడంతో విధ్వంసం జరిగింది. దాదాపు ఏడుగురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. ఇళ్లు, వాహనాలను తగులబెట్టారు. ఆది, సోమవారాల్లో ఈ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘటనలో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ స్పందించారు.