బెంగళూరు, మార్చి 25: ‘మోదీ’ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం.. ఆ తర్వాతి రోజునే ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు వేయడం ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఇంత హడావుడి చేసిన బీజేపీ.. కర్ణాటకలో ఓ అవినీతి కేసులో దోషిగా తేలి, రెండేండ్ల జైలుశిక్ష పడిన హవేరీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ (బీజేపీ) అనర్హత విషయంలో స్పందించలేదు. 2009-11 మధ్య సమయంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నది.
ఆ సమయంలో హవేరీ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత ఓలేకర్ బంధుప్రీతితో అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుమారులకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణల కేసులో ఎమ్మెల్యే ఓలేకర్తో పాటు ఆయన ఇద్దరి కుమారులు, మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు గత నెల ఫిబ్రవరి 13న తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేతో సహా అందరికీ రెండేండ్ల జైలు విక్ష విధించింది. కోర్టు తీర్పు మేరకు ఓలేకర్పై అనర్హత వేటు వేయాలి. కానీ, బీజేపీ పాలిత రాష్ట్ర సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనిపై ఇప్పుడు ప్రతిపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. ఇది ద్వంద్వ నీతి కాక మరేమిటని నిలదీస్తున్నాయి.