Kangana Ranaut : రైతుల నిరసనను బంగ్లాదేశ్ అలజడితో పోల్చిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రకటనపై కాంగ్రెస్ నేత ముంజాత్ పటేల్ మండిపడ్డారు. కంగనా రనౌత్కు పార్టీ టికెట్ ఇచ్చే సమయంలో బీజేపీకి బాలీవుడ్ క్వీన్ వైఖరి గురించి అర్ధం కాకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కంగనాతో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తప్పవని ముంతాజ్ పటేల్ పేర్కొన్నారు.
ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇవ్వడం కంగనా రనౌత్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఈ తరహా మతిలేని ప్రకటన అందునా దేశ రైతుల గురించి చౌకబారుగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. పదిమందికీ అన్నం పెట్టే అన్నదాతలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతుంటే ఆ తీవ్రతను గమనించకుండా బాధ్యతకలిగిన ఎంపీ ఇష్టారీతిన మాట్లాడటం సిగ్గుచేటని ముంతాజ్ పటేల్ అన్నారు.
కాగా, రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు.
సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్ధప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి. పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జిత్ గరేవాల్ కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Autos seized | ఒకే రిజిస్ట్రేషన్తో రెండు ఆటోలు.. సీజ్ చేసిన పోలీసులు