పనాజీ : బీజేపీకి తాను భయపడబోనని, ఆ పార్టీపై న్యాయ పోరాటం సాగిస్తానని విపక్ష కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు. లోబో వ్యాపార లావాదేవీలపై పాలక పార్టీ కనుసన్నల్లో ఆయనకు పలు నోటీసులు అందుతుండగా, మరోవైపు ఆయనపై వేటు వేయాలని స్వపక్షీయులే పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తుండటంతో లోబో ఇబ్బందికర పరిస్ధితి ఎదుర్కొంటున్నారు.ఈ ఏడాది మార్చిలో గోవాలో బీజేపీ సర్కార్ కొలువుతీరిన క్రమంలో పది నెలల్లో కాషాయ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని లోబో చెప్పుకొచ్చారు.
నెలలు గడిచిన మీదట పార్టీలో ఆయన ఉనికే ప్రశ్నార్ధకమైంది. కాంగ్రెస్లో చీలిక తీసుకువచ్చి పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ పంచన చేరేలా కుట్ర పన్నారని లోబోపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. పార్టీ చీలికకు సీనియర్ నేత దిగంబర్ కామత్తో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించిన లోబోపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన లోబో విపక్ష నేత పదవిపై కన్నేసిన వారు ఈ వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
గోవా కాంగ్రెస్లో ప్రస్తుత పరిణామాలను వివరించేందుకు లోబో త్వరలో ప్రియాంక గాంధీని కలవనున్నారని సమాచారం. పార్టీ హైకమాండ్ వద్ద విశ్వసనీయతను పెంచుకునేందుకు లోబో పావులు కదుపుతున్నారు. కాషాయ పార్టీపై విమర్శలకు పదునుపెట్టి కాంగ్రెస్ అధిష్టానం వద్ద పోయిన ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకు లోబో ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.