న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతం నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రపై విచారణ జరిపించాలని కోరారు. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరను పెంచి, వాటితో వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి రూ.82వేలకోట్ల రుణం పొందినట్లు హిండెన్బర్గ్ నివేదికలో పేర్కొంది.
కంపెనీ మోసాలకు పాల్పడుతుందని ఆరోపించింది. వివిధ దేశాల నుంచి హవాలా ద్వారా నగదు బదిలీ చేసేందుకు వివిధ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లక్షలకోట్ల ప్రజాధనాన్ని మోసం చేసిన అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జయ ఠాకూర్ డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, డీఆర్ఐ, సెబీ, ఆర్బీఐ వంటి సంస్థలతో విచారణ చేపట్టాలని, అదే సమయంలో సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ కేసు విచారణ జరిపించాలన్నారు. ఇదిలా ఉండగా.. అదానీ వ్యవహారంలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిన విషయం విధితమే. ఈ నెల 17న కమిటీ ఏర్పాటు సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.