డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలను ప్రకటిస్తూ ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ను కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ స్వాగతించారు. ఈసీ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈసీ మార్గదర్శకాలను తమ పార్టీ గౌరవిస్తుందని పేర్కొన్నారు.
ఇక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఒక దశలో పోలింగ్ జరగనుంది.
మణిపూర్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 10న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. కొవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ఈనెల 15 వరకూ రాజకీయ పార్టీల రోడ్షోలు, ర్యాలీలు, బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించింది. ఆపై క్షేత్రస్ధాయి పరిస్ధితులను సమీక్షించిన అనంతరం ఈసీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.