వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడంపై తమలో కొందరికి అభ్యంతరాలున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అంగీకరించారు. ఆయన చేరికపై తమలో కొందరికి సందేహాలు కూడా వున్నాయన్నారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్కి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని పేర్కొన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే.. పార్టీలో ఆయన చేరికపై వ్యతిరేకత లేదని, అందరూ ఓకేనే అంటున్నారని దిగ్విజయ్ వెల్లడించారు. ఆయన తమ పార్టీకి ఇచ్చిన రోడ్మ్యాప్ చాలా సంతృప్తికరంగా వుందన్నారు.
పీకే పక్కా లెక్కల మనిషి అని దిగ్విజయ్ అభివర్ణించారు. ఆ లెక్కలు వేయడం తమకు కొత్తేమీ కాదని, తమకు తెలియని అంశం అంతకంటే కాదని దిగ్విజయ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిశోర్ ఓ లెక్కల మనిషి. ఆ లెక్కలు మాకు కొత్తేమీ కాదు. మాకు తెలియనివీ కావు. అయితే.. ఆయన సలహాలపై ఎలాంటి వ్యతిరేకతా లేదు. ఉన్నదల్లా.. ఆయన ఇచ్చిన రోడ్ మ్యాప్ను పార్టీ ఎలా ఆవిష్కరించనుందన్నదే అసలైన ప్రశ్న అంటూ దిగ్విజయ్ పేర్కొన్నారు.
ప్రశాంత్ కిశోర్తో తనకు సన్నిహిత సంబంధాలే వున్నాయని, చాలా సార్లు కొన్ని అంశాలను చాలా లోతుగా చర్చించుకున్నామని డిగ్గీరాజా చెప్పుకొచ్చారు. ఆయనో రాజకీయ విశ్లేషకుడు. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి ఆయన మారారు. గతంలో ఆయనకు ఎలాంటి రాజకీయ నిబద్ధత లేదు. కానీ.. ఇప్పుడు కచ్చితమైన సూచనలతోనే మా ముందుకు వచ్చారు. ఓ తర్కబద్ధమైన, కచ్చితమైన సూచనలతో ఆయన మా ముందుకు వచ్చారు అంటూ దిగ్విజయ్ పేర్కొన్నారు.