Digvijay Singh | కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోమారు ఆరెస్సెస్పై విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో దిగ్విజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కనిపించని సంస్థ ఆరెస్సెస్ అని, ఆ సంస్థతో పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎలాగైతే చెదపురుగులు ఎలా ఉంటాయో… అలాగే ఆరెస్సెస్ కూడా పనిచేస్తుందని వివరించారు.
‘మీ సంస్థ ఎక్కడుంది చెప్పండి? అదేమైనా రిజిష్టర్ సంస్థనా? అనామికంగా పనిచేస్తుంది. అత్యంత రహస్యంగా పనిచేస్తూ వుంటుంది. బహిరంగ కార్యకలాపాలెక్కడా వుండవు. అబద్ధాలను ప్రచారం చేస్తుంది. ఆరెస్సెస్ బ్యానర్పై ఆ సంస్థ ఎప్పుడైనా ధర్నా చేసిందా? ఆందోళన అన్నా నిర్వహించిందా? ఎప్పుడూ చేయలేదు. ఈ విషయంపై చర్చించడానికి ఆరెస్సెస్ ముందుకు వస్తుందా?’ అంటూ దిగ్విజయ్ నిప్పులు చెరిగారు.
హిందూ ధర్మానికి ముప్పు ఎప్పుడూ వుండదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం అత్యంత విశాలమైందని, అందర్నీ దగ్గరికి తీసుకుంటుందన్నారు. క్రైస్తవం మొదట ఇక్కడికి వచ్చి, పశ్చిమ దేశాలకు వెళ్లిందని, ఆ తర్వాత ముస్లింలు కూడా వచ్చారని, అయినా హిందూ ధర్మానికి వచ్చిన ముప్పేమీ లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.