దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శించారు. ఆర్థిక విధానాలను వెంటనే మార్చాలని ఆయన సూచించారు. ప్రపంచ, దేశీయ పరిణామాలను లెక్కలకు తీసుకొని, విధానాలను మార్చాలన్నారు.
సంకల్ప్ చింతన్ శిబిర్ వేదికగా చిదంబరం శనివారం విలేకరులతో మాట్లాడారు. వృద్ధిరేటు మందగమనంతో ఉందని, ఇదే మోదీ ప్రభుత్వం హాల్మార్క్గా మారిపోయిందని చిదంబరం ఎద్దేవా చేశారు. కరోనా తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగమనంలోనే ఉందని, నిర్లిప్తంగానే వుందన్నారు.
ఇక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను కూడా కూలంకషంగా మరోసారి చర్చించుకోవాలని చిదంబరం అభిప్రాయపడ్డారు. జీఎస్టీ విధానాలను అతి పేలవంగా మోదీ సర్కార్ రూపొందించిందని, రూపొందించడమే కాకుండా ఆ విధానాలను 2017 లో అమలు చేసిందన్నారు. వాటి పర్యవసానాలను దేశం అనుభవిస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు.
1991 లో తమ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానం అన్న కొత్త శకానికి తెర లేపిందని, ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశం గొప్ప అభివృద్ధి దిశగా పయనించిందని చిదంబరం గుర్తు చేశారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, నూతన పారిశ్రామిక వేత్తలు, మధ్య తరగతి ప్రజల పెంపు, కొత్త ఉద్యోగాలు… ఇలా ఎన్నో ప్రయోజనాలు సమకూరాయని చిదంబరం చెప్పుకొచ్చారు.