న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ముస్లింలు మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ముస్లింలకు మీరు ఉద్యోగాలు ఇవ్వరు..వారిని మీరు పోలీస్, సైన్యం, నేవీలోకి తీసుకోరు..మరి ముస్లింలు మీకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ఆయా పార్టీలను నిలదీశారు.
కొందరు కాంగ్రెస్ నేతలు మతపరమైన యాత్రల గురించి మాట్లాడుతూ హిందువులుగా గర్విస్తున్నామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 22 కోట్ల మంది ముస్లింల్లో ఒకటి రెండు కోట్ల మంది ముస్లింలు మరణించినా సమస్య లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు ఓ మతానికి అనుకూలంగా చేస్తున్న నినాదాలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు తానేమీ బాధపడటం లేదని, దమ్ముంటే తనను పార్టీ నుంచి తొలగించాలని అజీజ్ ఖురేషీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా అజీజ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోను బీజేపీ ప్రతినిధి పంకజ్ చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. అజీజ్ ఖురేషీ గతంలో ఉత్తరాఖండ్, యూపీ, మిజోరాం గవర్నర్గా పనిచేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగానూ వ్యవహరించిన ఖురేషీ 1984 లోక్సభ ఎన్నికల్లో సత్నా ఎంపీగా ఎన్నికయ్యారు.
Read More :
Nuh violence | నూహ్లో ఎన్కౌంటర్.. మత ఘర్షణల నిందితుడి అరెస్ట్