Acharya Pramod : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు విపక్ష నేతలు దూరంగా ఉండటం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. శ్రీరాముడు భారత్ ఆత్మ అని, ఈ కార్యక్రమానికి హాజరు కారాదని విపక్షాలు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చివరికి క్రైస్తవుడు, ముస్లిం కూడా శ్రీరాముడి ఆహ్వానాన్ని విస్మరించరని, భారత్ రాముడి ఆత్మ అని, రాముడు లేకుండా భారత్ను ఊహించలేమని ఆచార్య ప్రమోద్ అన్నారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని మన్నించకపోవడం అంటే భారత నాగరికత, సంస్కృతిని అవమానించడమేనని పేర్కొన్నారు. భారత్ ఉనికిని, గౌరవాన్ని ప్రశ్నించడమేనని ఆక్షేపించారు. విపక్షాలు బీజేపీతో పోరాడాలని రాముడితో కాదని తాను చెప్పదలుచుకున్నానని అన్నారు. బీజేపీతో పోరాడండి కానీ సనాతనంతో కాదని, బీజేపీతో పోరాడండి కానీ భారత్తో పోరాడకండని ఆయన విపక్షాలకు హితవు పలికారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కాబోమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సహా పలువురు విపక్ష నేతలు స్పష్టం చేశారు. యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తాను ఆలయ ప్రారంభోత్సవం అనంతరం అయోధ్య సందర్శిస్తానని చెప్పారు. ఇక విపక్ష నేతలు రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరవకుండా రాముడి వ్యతిరేకులుగా వ్యవహరించారని బీజేపీ విరుచుకుపడుతోంది.
Read More :