బెంగళూరు, జనవరి 23: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలో నియామకాల లొల్లి కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత ఏడాది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తంతు తెగట్లేదు. పదవుల వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అసంతృప్తి రేగుతున్నది. రాష్ట్ర హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వర మంగళవారం మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ తీరుపై బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష నియామకాలకు సంబంధించి తాను చేసిన సూచనలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. నియామకాల విషయంలో ఏ ఒక్కరూ కూడా తమ అభిప్రాయాలు కోరలేదని తెలిపారు. ‘పేర్లు ఇవ్వమని నన్ను అడిగారు. నేను వాటిని పార్టీ హైకమాండ్కు ఇచ్చాను. కానీ జాబితా ఖరారు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేయలేదు, అభిప్రాయాలు కోరలేదు’ అని పరమేశ్వర పేర్కొన్నారు.
హోంమంత్రి పరమేశ్వర ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్లను లక్ష్యంగా చేసుకొని పలు వ్యాఖ్యలు చేశారు. బోర్డులు, కార్పొరేషన్ల పదవుల నియామకాలను సీఎం, డిప్యూటీ సీఎంలు జిల్లా స్థాయి నాయకులతో సంప్రదింపులు చేసిన తర్వాత జాబితాను తయారు చేయాలి కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి లిస్టును సిద్ధం చేస్తున్నారని ఎత్తిచూపారు. అనవసరంగా నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని పరమేశ్వర అసహనం వ్యక్తం చేశారు. ‘నేను కూడా పార్టీ అధ్యక్షుడిగా 8 ఏండ్లు పనిచేశాను. నేతలు, పార్టీ అభివృద్ధికి వారు చేసిన కృషి గురించి నాకు తెలుసు. దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారు. అలాంటి వారికి పదవులు ఇచ్చి గౌరవం ఇవ్వాలి. అంతేగానీ పార్టీ కోసం ఏమాత్రం పాటుపడని వారికి పదవులు ఇస్తే, అది పార్టీపై విశ్వాసం ఉండే వారిని మనస్తాపానికి గురిచేస్తుంది’ అని పరమేశ్వర అన్నారు. నియామకాలపై తుది నిర్ణయం తీసుకునే కంటే ముందుగానే సీనియర్ నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు బోర్డులు, కార్పొరేషన్ల నియామకాల కోసం పేర్లను ఖరారు చేశామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. జాబితాపై పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సంతకం చేశారని తెలిపారు. హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకోవడం కష్టమని పేర్కొన్నారు.