న్యూఢిల్లీ: ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి గురించి విశ్లేషణ చేయకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని మంత్రి అనురాగ్ అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మంత్రి అనురాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది గురించి అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారని, సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారని, అలాంటి ఘటనల పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని మంత్రి ఆరోపించారు.
వసుదైక కుటుంబం అన్న సందేశాన్ని ప్రధాని మోదీ వ్యాపింపచేస్తున్నారని, కానీ విపక్షాలు మాత్రం తప్పుడు భాషను వాడుతోందని, మూడు రాష్ట్రాల్లో ఓటమికి ఈవీఎంలను నిందిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై కాంగ్రెస్కు నమ్మకం లేదన్నారు. ఓటమి తర్వాత ఆ పార్టీ కారణాలను అన్వేషించలేకపోతున్నదని, వాళ్లు ఈవీఎంలను నిందిస్తున్నారని, సనాతన ధర్మాన్ని, హిందువులను, హిందూ సంస్కృతిని ప్రశ్నిస్తున్నారని కేంద్ర మంత్రి థాకూర్ తెలిపారు.