Kannada Congress | కుక్కతోక వంకర సామెత కర్ణాటకలో మరోమారు రుజువవుతున్నది. ముఖ్యమంత్రుల్ని దింపడానికి శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు సైతం వెనుకాడదని పేరున్న కాంగ్రెస్ పార్టీలో పీత రాజకీయంమొదలైంది. కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది.
అధికారంలోకి వచ్చి, ఒకటో కృష్ణుడు (సిద్దరామయ్య) గద్దెనెక్కి నాలుగు నెలలైనా గడవక ముందే అతన్ని దింపేందుకు రెండో కృష్ణుడు (శివకుమార్) క్యాంప్ రాజకీయం మొదలుపెట్టారు. అటు కరువు కష్టాలు.. ఇటు కరెంటు కోతలు.. బెంగళూరులో ట్రాఫిక్ సంక్షోభం.. అమలుకాని గ్యారెంటీల దుర్మార్గాలతో కన్నడిగులు ఒకవైపు సతమతమవుతుంటే, వారి బాధలపై ఏ మాత్రం దృష్టిపెట్టని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు రాజకీయ క్రీడకు తెగబడ్డారు.
50 శాతం కమీషన్ల దందాలో వాటాలు తేలకేమో తెల్వదుగానీ.. ముఖ్యమంత్రిని దించడానికి ముఠాలు కడుతున్నారు. అధిష్ఠానం చెప్పినా సరే వినే ప్రసక్తేలేదని ధిక్కరిస్తున్నారు. తాజా పరిణామాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పతనం అంచుకు చేరినట్టేనని ఇక దాని ఆయుష్షును వేళ్లమీద లెక్కబెట్టవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు కర్ణాటకను కకావికలం చేస్తున్న అక్కడి కాంగ్రెస్ నాయకులు తగుదునమ్మా అని తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం నివ్వెరపరుస్తున్నది.
కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామా? అని ఇప్పటికే తలపట్టుకుని కూర్చున్న కన్నడవాసులు తాజా పరిణామాలతో అవాక్కవుతున్నారు. ఇదేం పార్టీ, ఇదేం రాజకీయం.. అని విస్తుపోతున్నారు. తమపరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ఆక్రోశిస్తున్నారు.
బెంగళూరు, నవంబర్ 1/స్పెషల్ టాస్క్బ్యూరో (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఇలా ప్రతీ ఒక్కరూ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం, కేపీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు.. ఎత్తులకు పైఎత్తులు వేసుకొంటున్నారు. వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారు. వెరసి ఆరు నెలల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండం నూరేండ్ల ఆయుష్షు మాదిరిగా తయారైంది. ‘బీజేపీ 40 శాతం కమీషన్ రాజ్’ సర్కారును దించి కర్ణాటక పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్కు తొలిరోజు నుంచే అంతర్గత కుమ్ములాటల బెడద మొదలైంది. సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో అధిష్ఠానం తాత్సారం చేయడం, సిద్ధరామయ్య, డీకే వర్గాలు తమ నాయకుడినే సీఎంగా ప్రకటిస్తారని గట్టి నమ్మకంతో ఉండటంతో వివాదాలు తీవ్రమయ్యాయి. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వెనుకబడినవర్గానికి (ఓబీసీ) చెందిన సిద్ధరామయ్యను పార్టీ సీఎంగా ప్రకటించడంతో డీకే వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోలోన అసమ్మతితో రగులుతున్న డీకే కూడా సిద్ధరామయ్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం కూడా రెండు వర్గాలుగా చీలినట్టు తెలుస్తున్నది. గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. సీఎం మార్పు, క్యాబినెట్ మార్పులపై నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఇటీవల మాట్లాడుతూ ప్రభుత్వ రెండున్నరేండ్ల టర్మ్ తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కొంత మంది మంత్రులు సిద్ధరామయ్యేనే పూర్తి కాలం సీఎంగా ఉంటారని పేర్కొనగా, దానిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాలని మరికొంత మంది వ్యాఖ్యానించారు. మరోవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీరణపై సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ అశోక్ పట్టాన్ మాట్లాడుతూ రెండున్నరేండ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఇదే సమయంలో పలు కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్ల నియామకాల్లో తమ వర్గానికి అన్యాయం జరుగుతున్నదని ఇటు సిద్ధు వర్గం నేతలు, అటు డీకే వర్గం నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొన్నారు. ఇలా కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు ముదిరిపాకాన పడ్డాయి.
సతీశ్ ఎంట్రీతో మరింత హీట్
ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి ఎంట్రీతో కర్ణాటక కాంగ్రెస్లో సంక్షోభం మరింత తీవ్రమైంది. సిద్ధరామయ్యకు విశ్వాసపాత్రుడైన ఈయన.. ఉప ముఖ్యమంత్రి స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, దానికి డీకే మోకాలడ్డుతున్నారు. దీంతో తనకు కంచుకోట అయిన బెళగావి రాజకీయాల్లో డీకే జోక్యం చేసుకుంటున్నారని, ఆయనకు విశ్వాసపాత్రురాలైన మరో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్కు ప్రాధాన్యం ఇస్తున్నారని సతీశ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీన్ని పార్టీకి తెలిసేలా.. తనకు మద్దతుగా ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలతో మైసూరు దసరా వేడుకల సమయంలో ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. డీకే తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన సమయంలో ఇది జరుగడం గమనార్హం. అయితే సతీశ్ ఇదంతా తన బలప్రదర్శన కోసమే చేస్తున్నాడని గుర్తించిన అధిష్ఠానం.. సిద్ధరామయ్య ద్వారా వ్యవహారాన్ని చక్కబెట్టింది. అయితే, బెళగావిలో తన ప్రాధాన్యాన్ని డీకే వర్గీయులు మరింతగా తగ్గిస్తుండటం, కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్ల నియామకాల్లో తన అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడంతో తన ఎమ్మెల్యేలతో త్వరలో కచ్చితంగా క్యాంప్ పెడుతానని సతీశ్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు.
సీరియస్ వార్నింగ్
కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలు ఆ పార్టీ అధిష్ఠానాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలాకు బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు హుటాహుటిన చేరుకొని సిద్ధరామయ్య, డీకేతో దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలపై చర్చించామని తెలిపారు. ఎవరూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించకుండా చూడాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సూచించినట్టు చెప్పారు. ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే తమకు తెలుపాలని సూచించారు. బహిరంగంగా ప్రకటనలు చేస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు.
ప్రకంపనలకు అడ్డాగా బెళగావి
ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సంక్షోభానికి బెళగావి నేతల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధమే కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి మునిరత్న కూడా చెప్పారు. బెళగావిలో అత్యంత శక్తిమంతమైన తమ నేత సతీశ్ జార్కిహోళి ప్రాభవాన్ని డీకే వర్గం కావాలనే తగ్గించడానికి ప్రయత్నిస్తున్నదని సతీశ్ వర్గీయుల ఆరోపణ. ఇందులో భాగంగానే మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ను డీకే ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు.
తానొక్కడినే ఉండాలనుకొన్న డీకే
మేలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొత్తం నాలుగు ఉపముఖ్యమంత్రి స్థానాలు సృష్టించాలని అధిష్ఠానం భావించింది. సతీశ్కు కూడా డిప్యూటీగా అవకాశం ఇవ్వాలనుకొన్నట్టు వార్తలొచ్చాయి. అందుకు డీకే విముఖత చూపించారు. తాను ఒక్కడినే ఉప ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడంతో ఆయన మాటను అధిష్ఠానం అంగీకరించింది. ఇదే క్రమంలో బెళగావికి చెందిన లక్ష్మీ హెబ్బాళ్కర్ను సతీశ్కు ప్రత్యామ్నాయంగా డీకే చేయాలనుకొన్నారు. తద్వారా సిద్ధరామయ్యకు చెక్ పెట్టొచ్చని డీకే ప్రయత్నించినట్టు విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ను మళ్లీ ముంచేది బెళగావేనా?
2019లో కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం పతనానికి బెళగావి నాయకులే కారణమయ్యారు. సతీశ్ సోదరుడు రమేశ్ జార్కిహోళి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పతనానికి మరోసారి బెళగావికి చెందిన సతీశ్ జార్కిహోళి, లక్ష్మీ హెబ్బాళ్కర్ మధ్య ఆధిపత్యపోరే కారణం కావడం గమనార్హం.
ఎవరీ సతీశ్ జార్కిహోళి?
బెళగావిలో అత్యంత శక్తిమంతమైన నేతగా, వ్యాపారవేత్తగా సతీశ్ జార్కిహోళికి మంచి పేరుంది. సిద్ధరామయ్యకు విశ్వాసపాత్రుడైన ఈయన 2013-18 మధ్య సిద్ధు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈయనకు నలుగురు సోదరులు. పెద్ద సోదరుడు రమేశ్ జార్కిహోళి బీజేపీలో కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్-జేడీస్ సంకీర్ణ సర్కారును కూలదోయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. మరో సోదరుడు బాలచంద్ర బీజేపీలో కొనసాగుతుండగా, ఇంకో సోదరుడు లఖన్ స్వతంత్ర ఎమ్మెల్సీ. మరో సోదరుడు భీష్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు నిధులు సమకూర్చడంలో సతీశ్ కీలకమని, ప్రభుత్వంలో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు సతీశ్ గీసిన గీత దాటరని చెబుతారు.